జనగామ టౌన్, మే 26: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా వ్యక్తిగతంగా కక్షసాధింపు చర్యలకు నిరసనగా కలెక్టర్ బాధిత రక్షణ కమిటీ కన్వీనర్, హైకోర్టు న్యాయవాది సాధిక్అలీ మంగళవారం ఆమరణ దీక్ష చేపట్టారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కలెక్టర్ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్చేశారు. ఈ సందర్భంగా సాదిక్అలీ మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్థానిక మున్సిపల్ అధికారులకు హుకుం జారీ చేయడంతో మంగళవారం మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి సారథ్యంలో పలువురు రెవెన్యూ సిబ్బంది ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తన ఇంటి కొలతలు తీసుకున్నారని తెలిపారు.
ఈ రోజో, రేపో బుల్డోజర్లతో తన ఇంటిని కూల్చి వేయించడానికి కలెక్టర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తన ఇంటి నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల అనుమతులు మున్సిపాలిటీ నుంచి తీసుకున్నట్టు వివరించారు. జనగామ జిల్లా వ్యవసాయశాఖ నుంచి స్థానికంగా ఉన్న ఓ కాంట్రాక్టర్కు డబ్బులు రావాల్సిన కేసును హైకోర్టులో బాధితుడి పక్షాన బలమైన వాదనలు వినిపించడం కలెక్టర్కు నచ్చకపోవచ్చని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద వనిత టీస్టాల్, విజయ మిల్క్ పార్లర్ ఏర్పాటు చేసుకున్న దళిత, బహుజన మహిళా బాధితుల పక్షా న ప్రజాస్వామ్యయుతంగా తాను పోరాటం చేయడంతో కలెక్టర్ సహించలేకపోయారని వివరించారు.
కలెక్టర్ వ్యవహార శైలితో ఇబ్బందులు పడిన పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన కలెక్టర్ బాధితుల రక్షణ కమిటీకి కన్వీనర్గా ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించడం గిట్టలేదని తెలిపారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను వెంటనే జిల్లా నుంచి బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. లేకుంటే ఇక తనకే చావే శరణ్యమని స్పష్టంచేశారు. హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీని ఫోన్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పరామర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, కేవీపీఎస్, దళిత, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు సాధిక్కు మద్దతుగా నిలిచారు.