హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలు అటానమస్ (స్వయంప్రతిపత్తి) హోదాను దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ముందువరుసలో ఉన్నాయి. ఇదివరకు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీలకు అటానమస్ హోదాను కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం నుంచి పాలిటెక్నిక్ కాలేజీలకు అటానమస్ హోదా ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపట్టింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసింది. రాష్ట్రంలో 56 ప్రభుత్వ, 70 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి.
ఇవి స్వయంప్రతిపత్తి హోదా ను దక్కించుకొనేందుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్వయం ప్రతిపత్తి హోదా దక్కితే కాలేజీలే కొత్త కోర్సుల రూపకల్పనతో పాటు ఉన్న కోర్సుల రీడిజైన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ కాలేజీలే సొంతంగా పరీక్షలను నిర్వహించి, మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేసే స్వేచ్ఛను కలిగి ఉంటా యి. అయితే అడ్మిషన్లు మాత్రం పాలిసెట్ ద్వారా చేపడుతారు. గతంలో టెక్విప్ ప్రోగ్రాంలో భాగంగా పాలిటెక్నిక్ కాలేజీలకు అటానమస్ హోదా కల్పించగా, ఈ గడువు ముగిసింది. తాజాగా ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం అటానమస్ హోదా దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.