హైదరాబాద్ : దళిత బంధు పథకాన్ని ఎవరూ ఆపలేరని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కలెక్టరేట్లో 14 మండలాల్లో ఎంపికైన 199 మంది దళితబంధు లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులకు యూనిట్లకు సంబంధించి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పథకం దేశంలోనే సాంఘిక విప్లవానికి నాంది పలుకుతుందని, ఈ మేరకు సీఎం కేసీఆర్ పథకాన్ని తీర్చిదిద్దారన్నారు.
ఏ పాలకుడైనా ప్రజల ఆకలిని తీర్చాలని, అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. తాత్కాలిక భావోద్వేగాలతో ఎవరూ ఎల్లకాలం మనలేరని మంత్రి అన్నారు. తెలంగాణ పథకాలు ఖచ్చితంగా రేపు దేశానికి దిక్సూచి అవుతాయన్నారు. రైతుబంధును నాలుగు రాష్ట్రాలు ఇప్పుడు అమలు చేస్తున్నాయన్నారు. అన్ని ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో, వైన్స్ దుఖానాల్లో దళితులకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. పేదరికం, నిరుద్యోగం ప్రపంచమంతా ఉందని, అక్షరాస్యత, నిరక్షరాస్యత ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్యలన్నారు.
దేశానికి కులవివక్ష ఎంత ప్రమాదమో.. లింగవివక్ష అంతే ప్రమాదకమన్నారు. పుట్టుక ఎవరి గొప్పతనాన్ని నిర్దేశించదని, అలా అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమం 2009-2011 వరకు దళిత సాధికరతపై అనేక మంది మేధావులతో చర్చలు జరిగాయన్నారు. సాగునీరు, కరెంటు, తాగునీటి సమస్యలు మొదటి విడుత పాలనలో పరిష్కరించుకున్నామని, రెండో విడుతలో సమాజంలో అనగారిన వర్గాల అభ్యున్నతిపై దృష్టి పెట్టామన్నారు.
దళితబంధును ఆర్థిక కోణంలో చూడొద్దని, ఇది దళితులను సమాజంలోని ప్రధాన స్రవంతిలోని అభివృద్ధి చెందిన వర్గాల సరసన నిలబెట్టేదన్నారు. పథకంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో యూనిట్లను సందర్శించేందుకు సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, అదనపు కలెక్టర్ ఆశిష్ సెంగ్వాన్, జేసీ వేణుగోపాల్, జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ , మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.