హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆదివాసీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలకు ఓ స్వచ్ఛంద సంస్థ తోడు నిలుస్తున్నది. మారుమూల ఆదివాసీ, గిరిజన, చెంచు తండాల్లో జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రజల ప్రత్యేక అవసరాలను తీరుస్తూ తెలంగాణ సర్కారు లక్ష్యాలను నెరవేర్చేందుకు ‘నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ సొసైటీ’ సంస్థ కలిసి నడుస్తున్నది. 2005లో ఏర్పాటైన ఈ సంస్థ ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల్లో ఆయా వర్గాల కోసం 20కి పైగా ప్రాజెక్టులను నిర్వహించింది. దాదాపు 19వేల మందికి పైగా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానంగా మెప్మా, డీఆర్డీవో, ఐటీడీఏ, సీపెడా, ఇగ్నో వంటి సంస్థల సహకారంతో ఆదివాసీలకు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రవేశాలు కల్పించింది. 19 ఏండ్ల తన ప్రయాణాన్ని పూర్తిచేసుకొని, ఇప్పుడు హైదరాబాద్లో మరో ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమైంది.
సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చే కోర్సులు
నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ సొసైటీ ద్వారా అనేక రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్టు సంస్థ నిర్వాహకుడు బీ సురేశ్కుమార్ తెలిపారు. వీటిలో ముఖ్యంగా సెక్యూరిటీ, వనబంధు, కల్యాణయోజన, బీపీవో, నర్సింగ్, కాల్సెంటర్, టైలరింగ్, హాస్పిటాలిటీ, హ్యాండ్సెట్ రిపేరింగ్, కంప్యూటర్ ఆపరేటింగ్, బ్యూటీ పార్లర్, బ్యాంకింగ్ సెక్యూరిటీ, రిటైల్ మార్కెటింగ్, సీసీ కెమెరాల రిపేరింగ్ వంటి రంగాల్లో శిక్షణనిచ్చి, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. సంస్థ శిక్షణలో దివ్యాంగులకు ప్రత్యేకమైన అవకాశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడులోనూ సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తున్నదని చెప్పారు. కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులను కర్ణాటకలోని గౌరీబిందుపూర్, చిక్బళ్లాపూర్, బీదర్, గుల్బర్గా, బస్వకల్యాణ్, శివమొగ్గ, ఒడిశాలోని బలారిపూర్, బల్లార్షా వంటి ప్రాంతా ల్లో 20కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేసిందని అన్నా రు. 19 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇదే స్ఫూర్తితో అక్టోబర్లో హైదరాబాద్ అంబర్పేట డివిజన్లో 40 మంది మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
డిజిటల్ లిటరసీలో శిక్షణ
డిజిటల్ లిటరసీ కల్పనలో భాగంగా కరీంనగర్, నారాయణపేట, వరంగల్, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో లిటరసీ స్కూళ్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 10 కంప్యూటర్ల చొప్పున ఏర్పాటు చేసి, ఇద్దరు శిక్షకులతో శిక్షణ ఇప్పించింది.