హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పోస్టుల భర్తీని అత్యంత పారదర్శకంగా చేపడుతామని టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి వెల్లడించారు. ప్రతిభకు మాత్రమే పట్టం కడుతామని స్పష్టంచేశారు. నోటిఫికేషన్ విడుదల అనంతరం మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. 1990లో గ్రూప్-1 మూడోర్యాంకర్గా ఎంపికయ్యి, ఉద్యోగంలో ప్రవేశించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి నేడు టీఎస్పీఎస్సీ చైర్మన్ హోదాలో అదే గ్రూప్-1కు నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన 31 ఏండ్ల సర్వీసులో గ్రూప్-1 పోస్టులను భర్తీచేయడం తనకు లభించిన గొప్ప అవకాశమని అన్నారు. 11 ఏండ్ల తర్వాత 503 పోస్టులను భర్తీచేసే గురుతర బాధ్యతను చేపట్టినందుకు సంతోషంగా, గర్వంగా ఉన్నదని చెప్పారు. సివిల్స్కు ప్రిపేరయ్యేవారికి ఇబ్బంది లేకుండా షెడ్యూల్ను రూపొందించామని, ఇతర పరీక్షలను సైతం పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్ 5న జరగనున్నది. మెయిన్స్ సెప్టెంబర్లో ఉంటుంది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ను జూలై/ఆగస్టుల్లో, మెయిన్స్ను నవంబర్/డిసెంబర్లో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించామని వివరించారు.
ఈ-పేపర్తో కాపీయింగ్కు చెక్
కాపీయింగ్ను అరికట్టడంలో భాగంగా మెయిన్స్లో ఈ-పేపర్ ఇవ్వాలని నిర్ణయించినట్టు జనార్దన్రెడ్డి చెప్పారు. ‘మెయిన్స్కు 25వేలకు పైగా అభ్యర్థులు ఎంపికవుతారు. వారందరికి ఈ-పేపర్ ఇస్తాం. పరీక్ష 10 గంటలకు ఉంటే ప్రశ్నపత్రం 9:55 గంటలకు తెరుచుకుంటుంది. మూడు గంటలపాటు మాత్రమే ప్రశ్నలు కంప్యూటర్ లేదా ట్యాబ్ తెరపై కనిపిస్తాయి. పరీక్షకు ముందు, పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రం కనబడదు. మూల్యాంకనం సైతం డిజిటల్గానే జరుగుతుంది. జవాబు పత్రాలను స్కాన్చేసి పంపించి వాల్యుయేషన్ చేయిస్తామని’ తెలిపారు.గ్రూప్-1 ఉద్యోగాల భర్తీని 10 నెలల్లో పూర్తిచేస్తామని చెప్పారు. ఈ మేరకు షెడ్యూల్ను రూపొందించామని, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఉద్యోగాల భర్తీకి గతంలో మూడు నుంచి ఆరేండ్లు పట్టేదని గుర్తుచేశారు.