కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 25: వానకాలం పంట సేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందని అంచనా వేసినట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను సీఎం కేసీఆర్ అందించారని పేర్కొన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట సేకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని, రాష్ట్రవ్యాప్తంగా 7,100కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట మరో వంద వరకు కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ సారి పంట సేకరణకు 25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ఇప్పటికే 14 కోట్ల గన్నీ బ్యాగులను సేకరించినట్టు చెప్పారు. మాయిశ్చర్ మెషిన్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు తదితర సామగ్రిని అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. రెండున్నర నెలలపాటు ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. కాగా ఇప్పటికే కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు తెలిపారు.