Kavitha | రాజకీయంగా సీఎం కేసీఆర్ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలని.. బీఆర్ఎస్ను ఓడించడం ఎవరితరం కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బోధన్లో జరిగిన మహా యువగర్జన సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో యువత ముందునడిచిందని, ఎత్తిన పిడికిలి దించకుండా ఉద్యమించారని గుర్తు చేశారు. నాకేందని అనుకుంటే దేశానికి స్వతంత్రం వచ్చేది కాదన్నారు. తెలంగాణ సైతం వచ్చేది కాదని, ఆ క్రమంలో ఎన్నికలు వచ్చాయి కాబట్టి బాధ్యత తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్కు ఓట్లు వేయించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ప్రతి గుండెను తట్టి ఓట్లు వేయించాలన్నారు. అభివృద్ధిపై ఆశ ఉన్న యువకులు కదలాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ యువ విభాగం బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదన్నారు. ప్రతి ఇంటి నుంచి పార్టీకి ఓట్లు వేయించాలన్నారు. బోధన్లో కాంగ్రెస్ అభ్యర్థి పీ సుదర్శన్ రెడ్డిని గెలిపించడంతో ప్రజలకు ఏ మాత్రం లాభం లేదన్నారు. షకీల్ను 50వేలపైగా మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గెలిస్తే పొద్దు పొడుసుడు ఉందని, కేవలం పొద్దుగూకుడే ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయంలో భారీ నీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధనయజ్ఞానికి సహకరించారు తప్పా బోధన్ ప్రాంతానికి చుక్క నీరు కూడా తేలేదని విమర్శించారు.
ఆయన సొంత గ్రామం సిర్నపల్లిలో చెరువుకు షకీల్ రూ.53 లక్షలతో మరమ్మతు చేయించారు తప్పా.. ఆయన రూపాయి తీసుకురాలేదన్నారు. బీజేపీ అభ్యర్థి మోహన్ రెడ్డి స్వగ్రామయంలో చెరువులను షకీలే బాగు చేయించారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.17కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు. సుదర్శన్ రెడ్డి గ్రామానికే రూ.7కోట్లు ఖర్చు చేశామని వివరించారు. తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రైతుబంధు రాని ఇల్లు లేదని స్పష్టం చేశారు. బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో అదే స్ఫూర్తితో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.