హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): వాడుకొని వదిలేయడం.. బీజేపీ నైజమని మరోసారి నిరూపితమవుతున్నది. పార్టీలో చేరినవారిని ఆర్థికంగా పీల్చి పిప్పి చేసి.. వదిలేస్తారంటూ ఆ పార్టీ మాజీలు చెప్తున్నదే నిజమవుతున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం 119 నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించారు.
ఒక ప్రాంతానికి చెందిన నేతలను ఏమాత్రం సంబంధం లేని మరో ప్రాంతానికి విసిరేశారన్న అసంతృప్తి వ్యక్తమవుతున్నది. దీనికితోడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సునీల్ బన్సల్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ఇన్చార్జులకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో నేతలంతా ఒక్కసారిగా భగ్గుమన్నట్టు తెలిసింది.
తమను బీజేపీలోకి ఆహ్వానించే సమయంలో టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, ప్రచారాలు, సభ లు, సమావేశాలకు రూ.లక్షలు ఖర్చు చేయించి ఇప్పుడు గాలికి వదిలేస్తారా? అని నియోజకవర్గ ఇన్చార్జులు రాష్ట్ర నేతలను నిలదీసినట్టు సమాచారం. తమకు ఇష్టం లేకపోయినా.. లీ డర్ల కొరత వల్ల నామ్ కే వాస్తేగా నియోజకవర్గ ఇన్చార్జి దూలాన్ని బలవంతంగా మెడకు కట్టారని పలువురు నాయకులు అంతర్గత చర్చల్లో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
బీజేపీకి లీడర్లే లేరని, నియోజకవర్గ ఇన్చార్జులను పక్కనబెడితే ఎమ్మెల్యే అభ్యర్థులను ఎక్కడి నుంచి తెస్తారని ఎద్దేవా చేసినట్టు సమాచారం. మరికొందరు నేరుగా బన్సల్, బండి సంజయ్ దగ్గరికి వెళ్లి తమకు ఇన్చార్జ్జుల పదవులు వద్దని, టికెట్లు ఇస్తే ఇవ్వండి-లేదంటే లేదు అని కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. ‘సర్వీస్ చేయడానికి మేమేమన్నా ఆరెస్సెస్ కార్యకర్తలమా?’ అని వెటకారం చేసినట్టు తెలిసింది. దీంతో బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టినట్టు సమాచారం. ఆరు నెలలపాటు ఇన్చార్జ్జులుగా కొనసాగండి, టికెట్లు ఇప్పిస్తానని బండి సంజయ్ సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది.
కూరలో కరివేపాకులా చూస్తారా?
సమావేశం నుంచి బయటికి వచ్చిన నేతలు తమ సన్నిహితుల దగ్గర బాధను వెళ్లగక్కారు. పార్టీకి క్యాడర్, ప్రజల్లో ఆదరణ లేకపోయినా టికెట్లపై ఆశతో సొంత పరపతిని పణంగా పెట్టి బీజేపీలో చేరామని వాపోయినట్టు సమాచా రం. పార్టీలో చేరిననాటి నుంచి వివిధ కార్యక్రమాలకు తమతో రూ.లక్షలు ఖర్చు పెట్టించి, ఇప్పుడు కూరలో కరివేపాకులా తీసేస్తున్నారని మండిపడినట్టు తెలిసింది. పార్టీ నైజం తెలియ క చేరామని, ఇన్నాళ్లూ సమయం వృథా చేశామని కొందరు వాపోయినట్టు సమాచారం. ‘బీజేపీ వాడుకొని వదిలేస్తుంది. అందుకే శివసేన, అకాలీదళ్ వంటి మిత్రపక్షాలు దూరమయ్యా యి. రేపు మీకూ అదే గతి. పీల్చి పిప్పిచేసి వదిలేస్తారు’ అంటూ పలువురు అనుభవజ్ఞులు ఎంత హెచ్చరించినా తాము వినలేదని మరికొందరు ఆవేదన చెందుతున్నారు.
మా గతేం కావాలి?
టికెట్ మీద ఆశతో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హైదరాబాద్కు చెందిన ఓ మహి ళా నేత.. ఇప్పటికే ఫ్లెక్సీలు, కిరాయి ప్రచారం, సోషల్ మీడియా టీమ్ పేరుతో రూ.లక్షలు ఖర్చు పెట్టారు. దీనికితోడు చర్చలు, సమావేశాల పేరుతో మొత్తం ఖర్చు తనతోనే పెట్టించారని సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. ఇప్పుడు ఆమెను ఏమాత్రం సంబం ధం లేని మారుమూల జిల్లాలోని ఓ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఆమె మైండ్బ్లాంక్ కాగా.. బన్సల్ ప్రకటనతో గుండెల్లో రాయిపడింది.
ఇన్నాళ్లూ ఆర్థికంగా వాడుకొని, ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారంటూ ఆమె లబోదిబోమంటున్నారు. ఇలా ఎంతోమంది నేతలు ‘ఇప్పుడు మా గతి ఏమిటి?’ అంటూ రాష్ట్ర నేతలకు ఫోన్లు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే పార్టీలో చేరిన హైదరాబాద్ శివారు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పరిస్థితి సైతం ఇలాగే ఉన్నది. ఆయనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు.