హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): బోగస్ అధ్యాపకులను అరికట్టేందుకు జేఎన్టీయూ కొత్త మార్గాలను అనుసరిస్తున్నది. ఫ్యాకల్టీ సమర్పించిన విద్యార్హత ధృవీకరణ పత్రాలను ఐదు నెలలపాటు యూనివర్సిటీ వద్దే ఉంచకుంటున్నది. ఈ మధ్యకాలంలో ఎవరివైనా ఫేక్ సర్టిఫికెట్లుగా అనుమానం వచ్చినా, ఫిర్యాదులందినా విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోనున్నారు. జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీల్లో బోగస్ అధ్యాపకులు పనిచేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఫేక్ పీహెచ్డీలు, ఎంటెక్ ధ్రువీకరణలు సమర్పించి ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లుగా పనిచేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి జేఎన్టీయూ మూడంచెల విధానాన్ని అనుసరించనున్నది.