హైదరాబాద్ : నిన్న, మొన్నటి వరకు తెలంగాణలో వర్షాలు దంచికొట్టాయి. అయితే ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. ఈ ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 60 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 21 జిల్లాల్లో అధిక వర్షపాతం (20 నుంచి 50 శాతం మధ్యలో) నమోదు కాగా, ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఏ ఒక్క జిల్లాల్లోనూ వర్షపాతం లోటు లేదు.
జూన్ 5వ తేదీన రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించాయి. ఇప్పటికీ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా ఉన్నాయి.
జూన్ 1 నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు 873.9 మి.మీ. వర్షపాతం (సాధారణ వర్షపాతం 650.9 మి.మీ.) నమోదైంది. అంటే సాధారణ వర్షపాతం కంటే 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 863.9 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో 95 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76 శాతం, వరంగల్ అర్బన్లో 75 శాతం, నారాయణపేటలో 72 శాతం, కరీంనగర్ జిల్లాలో 64 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నాగర్కర్నూల్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది.