Sheep Distribution | పెద్దపల్లి, జనవరి 14 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. పథకాన్ని రద్దు చేశారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. గతంలో తాము కట్టిన వాటా డబ్బులు తిరిగిచ్చేయాలని గొల్ల, కుర్మ, యాదవులు పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే 20 మంది వినతిపత్రాలు అందజేశారు. ఈ విషయాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులు కలెక్టర్తోపాటు రాష్ట్ర శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరైతే డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో వారికి సంక్రాంతి తర్వాత డబ్బులు తిరిగిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సగం మందికే అందిన గొర్రెలు
కేసీఆర్ ప్రభుత్వం సూచన మేరకు జిల్లాలో 2,974 మంది డీడీలు కట్టారు. మొత్తం 21 జీవాలుండే యూనిట్ విలువ రూ.1.75 లక్షలు ఉండగా.. సబ్సిడీ కింద ఒకో లబ్ధిదారు రూ.43,750 వాటా ధనం చెల్లించారు. డీడీలు కట్టిన వారిలో సీనియార్టీ ప్రకారం జాబితాను తయారు చేసిన పశుసంవర్ధక శాఖ అధికారులు.. జీవాల కోసం లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు తీసుకెళ్లారు. ప్రాధాన్యతా క్రమంలో గొర్రెలు ఇచ్చేందుకు 2,974 మంది నుంచి వాటా ధనంగా డీడీలు తీసుకున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.43,750 చొప్పున రూ.13 కోట్ల వరకు స్వీకరించారు. 2023 జూన్ 9న దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఆ సమయానికి 1,267 మందికి మాత్రమే గొర్రెలు పంపిణీ చేశారు. ఇంకా జిల్లాలో 1,707 మందికి యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో గొర్రెల పథకంపై సందిగ్ధత నెలకొన్నది. ఈ పథకంపై కొత్త ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో డీడీలు కట్టి.. గొర్రెలు అందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
యాదవులందరికీ న్యాయం చేయాలి
జిల్లాలో యాదవులందరికీ సమాన న్యాయం జరగాలి. ఇప్పటి వరకు కొంత మందికి మాత్రమే గొర్రెలు పంపిణీ చేశారు. మేమూ డీడీలు కట్టాం. మాకు కూడా గొర్రెలను పంపిణీ చేయాలి. లేదంటే డబ్బులు వాపస్ చేయాలి. -కూరాకుల ఓదేలు, లబ్ధిదారుడు,
శుక్రవారంపల్లి, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా
ఇబ్బంది పడకుండా చూస్తున్నం
రెండో విడత గొర్రెల పంపిణీకి డీడీలు కట్టిన చాలా మంది.. ఎన్నికల తర్వాత పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి వచ్చి డబ్బులు అడుగుతున్నారు. విషయాన్ని కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. డబ్బులు వాపస్ కావాలని కోరుతున్న వారికి కలెక్టర్ అనుమతితో తిరిగిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు 20 మంది వచ్చి డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరారు. వారందరికీ సంక్రాంతి తర్వాత డబ్బులు తిరిగిస్తాం. ప్రభుత్వం గొర్రెల పంపిణీకి అనుమతిస్తే తిరిగి డీడీలు తీసుకుంటాం.
-రవీందర్రెడ్డి, ఏడీ, పశుసంవర్ధక శాఖ, పెద్దపల్లి జిల్లా
అందరికీ గొర్రెలను పంపిణీ చేయాలి
ఇప్పటికే జిల్లాలో మొదటి, రెండో విడతల్లో గొర్రెలను పంపిణీ చేశారు. నేను డీడీ తీసినా నాకు గొర్రెలు ఇవ్వలేదు. డీడీలు కట్టినా గొర్రెలు అందని వారందరికీ పంపిణీ చేయాలి. లేదా లబ్ధిదారుకు ఆ యూనిట్ కాస్టును చెల్లించాలి.
-బక్కతట్ల దేవేందర్, లబ్ధిదారుడు, మచ్చుపేట, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా