హైదరాబాద్ సిటీబ్యూరో/ బన్సీలాల్పేట, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): గాంధీలో మహిళను బంధించి లైంగికదాడికి పాల్పడ్డారనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని దవాఖాన వైద్యులు పేర్కొంటున్నారు. దవాఖానలో సెక్యూరిటీ పటిష్టంగా ఉన్నదని.. ఇలాంటి ఘటనలకు అసలు ఆస్కారమే లేదని చెప్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వాస్తవాలు పోలీసుల విచారణలో బయటకు వస్తాయని తెలిపారు. దవాఖానలోని చీకటిగదిలో మహిళను బంధించి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలకు ఆధారాలేవీ లభించలేదని నలుగురు సభ్యులతో గాంధీ సూపరింటెండెంట్ ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ ధ్రువీకరించినట్టు తెలిసిం ది. పోలీసులు దవాఖానలోని సీసీ కెమెరాలతోపాటు పరిసరాల్లోని కెమెరాలను విశ్లేషిస్తున్నారు. ఫిర్యాదుచేసిన మహిళతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ల్యాబ్టెక్నీషియన్ నుంచి వివరాలను సేకరించారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
600 సీసీ కెమెరాల విశ్లేషణ
లైంగికదాడి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ము మ్మరం చేశారు. బాధితురాలు చెప్పే అంశాలను పరిగణనలోకి తీసుకొని దవాఖానలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమె 12,13,14 తేదీల్లో దవాఖాన పరిసరాల్లో ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అదృశ్యమైనట్టుగా భావిస్తున్న మహిళ 11వ తేదీన ముషీరాబాద్ నుంచి వెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఆ రోజు గాంధీ నుంచి బయటకెళ్లిన అక్కాచెల్లెండ్లు నగరంపై అవగాహన లేకపోవడంతో దారితప్పినట్టు అనుమానిస్తున్నారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ కోసం పోలీసులు రెండ్రోజులుగా 600 సీసీ కెమెరాలను విశ్లేషించారు. ఇందులో ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్డులో ఆమె నడుకుంటూ వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. ఒక్కో కెమెరాను పరిశీలిస్తూ, ఆమె ఎటు వైపు వెళ్లిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు బాధితురాలి ఫిర్యాదులోని అంశాలతోపాటు వైద్యబృందం ఇచ్చిన రిపోర్టులను విశ్లేషిస్తున్నారు.
మీడియా సంయమనం పాటించాలి
గాంధీ దవాఖాన ప్రతిష్ఠను దిగజార్చేలా తొందరపడి వార్తలు రాయొద్దని రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి మీడియాకు విజ్ఞప్తి చేశారు. దవాఖాన ఘటనపై పోలీసుల దర్యాప్తు జరుగుతున్నదని.. వాస్తవాలు త్వరలోనే బయటపడుతాయని చెప్పారు. లైంగికదాడి ఆరోపణలు, దవాఖానలో సెక్యూరిటీపై బుధవారం ఆయన గాంధీ దవాఖాన సూపరిండెంట్ రాజారావు, ఆర్ఎంవోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులు, వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ప్రతి అంతస్తులో ఉండే ఆర్ఎంవో లేదా గ్రౌండ్ఫ్లోర్లో ఉండే సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రతి అంతస్తులో ఫిర్యాదుల బాక్స్లను ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రేడియాలజీ విభాగం ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్ను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. దవాఖానలో ఎలాంటి చీకటి గదులు లేవని, 24 గంటలు పనిచేసే సెక్యూరిటీ వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని పేర్కొన్నారు.