న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఎంబీబీఎస్ కోర్సు ఉత్తీర్ణత మార్కుల పర్సంటేజ్ను తగ్గిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ వెనక్కి తీసుకుంది. ఇటీవల తీసుకొచ్చిన 40 శాతం పాస్ విధానాన్ని సవరిస్తూ ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది. పాత విధానం ప్రకారమే 50 శాతం పాస్ పర్సంటేజ్ ఉంటుందని తాజాగా వెల్లడించింది. పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాన్ని మార్చుకున్నట్టు శుక్రవారం అధికారికంగా ఓ నోటిఫికేషన్ను ఎన్ఎంసీ విడుదల చేసింది. సాధారణంగా ఎంబీబీఎస్ కోర్సులో అగ్రిగేట్ సబ్టెక్టుల్లో (థియరీ, ప్రాక్టికల్ కలిపి) ఓవరాల్గా కోర్సు చివర్లో 50 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణతగా పరిగణిస్తారు. అయితే సెప్టెంబర్లో ఈ పాస్ పర్సంటేజ్ను 40 శాతానికి తగ్గిస్తూ ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీబీఎంఈ) పాఠ్య ప్రణాళిక (కరిక్యులమ్) మార్గదర్శకాలను సవరించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.