Vemula Prashanth Reddy : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల సెక్రటరీ గడ్డం మోహన్ రెడ్డి శనివారం వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వాళ్లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిలో భాగం అయ్యేందుకు మోహన్ రెడ్డి, తదితరులు టీఆర్ఎస్లో చేరారని, టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ది సాకారమవుతుందని అన్నారు.
రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, కుల వృత్తులకు ప్రోత్సాహం వంటి సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు సంబురంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఐటీ, పరిశ్రమలు, మున్సిపాలిటీల్లో కేటీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. దాంతో, అన్ని రంగాల్లో తెలంగాణ యావత్ దేశానికి రోల్ మోడల్గా నిలుస్తోందని మంత్రి తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని, ఎన్నటికైనా కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి, దేశానికి శ్రీరామ రక్ష అని మంత్రి వేముల స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజిరెడ్డి, బోనగిరి రమేష్, ఏనుగు నవీన్, తదితరులు పాల్గొన్నారు.