హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ) : మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టులో కాంగ్రెస్ తన అవినీతి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. మల్కాజిగిరిలోని ఔషాపూర్ రాక్ ఎంక్లేవ్లో మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాజెక్టును ప్రజాధనాన్ని దోచుకునే మరో అవకాశంగా మల్చుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఢిల్లీ దర్బార్కు తెలంగాణ ఏటీఎంగా మారిందని, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా పెద్ద మొత్తంలో వసూలు చేసిన డబ్బులు ఢిల్లీకి వెళ్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ఒక్క గ్యారంటీని కూడా పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో రాజకీయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిని విస్మరించి కేవలం కమీషన్లపైనే కాంగ్రెస్ నాయకులు దృష్టిపెట్టారని చురకలంటించారు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని నబీన్ ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్కు అధికారం అంటే స్వప్రయోజనాలకు సాధనం లాంటిదని ఉదహరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.