హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్ శాఖ సీడీఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ (ఎంకేసీ)పై నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది. పట్టణాలపై అధ్యయనం, పరిశోధన చేసేవారికి, నిపుణులకు అవసరమైన సమాచారమంతా ఒకేచోట లభించేందుకు ఈ నాలెడ్జ్ సెంటర్ ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నది. ఈ నెల 13న నీతి ఆయోగ్ బృందం మాసాబ్ ట్యాంక్లోని సీడీఎంఏ కార్యాలయంలో ఎంకేసీని సందర్శించింది. తమ అనుభవాలను ఈ-మెయిల్ ద్వారా సోమవారం నీతి ఆయోగ్ డిప్యూటీ సలహాదారు బిశ్వంత్ బిసోయ్ మున్సిపల్ అధికారులకు తెలిపారు. నాలెడ్జ్సెంటర్లో ఏర్పాటు చేసిన పుస్తకాలను, మ్యాపింగ్ గదిని పరిశీలించామని.. పట్టణ అంశాలపై అధ్యయనం చేసేవారికి ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సీడీఎంఏ సత్యనారాయణ, ఇతర అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. మ్యాపింగ్ విధానం బాగున్నదని కొనియాడారు.
సమాచారం అంతా ఒకేచోట
ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు సూచనల మేరకు ఎంకేసీని ఏర్పాటుచేశారు. ఇందులో పట్టణ సమగ్ర అంశాలపై సమాచారం అంతా లభిస్తుంది. మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని అంశాలను పుస్తకాల రూపంలో భద్రపర్చారు. వేల సంఖ్యలో పుస్తకాలు ఇకడ అందుబాటులో ఉన్నాయి. మ్యాపింగ్ రూంలో ప్రపంచం, భారతదేశం, తెలంగాణ, మున్సిపాలిటీలు, పారిశుధ్యం తదితర అంశాలకు సంబంధించిన మ్యాప్లు ఉన్నాయి. దానిని మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు. తెలంగాణలోని వివిధ పట్టణాల్లో చేపట్టిన కార్యక్రమాలు, వినూత్న పథకాల వివరాలు, డిజిటల్ విధానం ఫొటో గ్యాలరీలో అందుబాటులో ఉంచారు.