Nirmal | హైదరాబాద్ : ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో నిర్మల్ జిల్లాలో వానలు దంచికొట్టాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా 75 శాతం వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్లో జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది.
నిర్మల్ జిల్లాలో జూన్ 1 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు సాధారణంగా 503 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. కానీ 857 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా 75 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బాసర, సారంగాపూర్, నిర్మల్ రూరల్, సోన్, దస్తురాబాద్ మండలాలు మినహా మిగిలిన మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లాలో 560 మి.మీ. సాధారణ వర్షపాతానికి గానూ 811 మి.మీ. వర్షపాతం నమోదైంది. అధికంగా 45 శాతం వర్షపాతం నమోదైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 551 మి.మీ. వర్షపాతానికి గానూ 718 మి.మీ. వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 29 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 499 మి.మీ. కాగా, 643 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేసి వరి నారుమళ్లు పోసుకున్నారు. పత్తి, సోయా, ఎర్రజొన్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు.