హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంచడమే లక్ష్యంగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రత్యేక మొబైల్ యాప్ను అభివృద్ధి చేసింది. జర్మనీకి చెందిన ఆగ్స్బర్గ్ వర్సిటీతో కలిసి రూపొందించిన న్యూట్రిఎయిడ్ అనే యాప్ను గురువారం ఆవిష్కరించింది.
ఎన్ఐఎన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత, ఆగ్స్బర్గ్ వర్సిటీ ప్రొఫెసర్ మార్కస్ కెక్ సమక్షంలో యాప్ను ఆవిష్కరించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రత్యేక టూల్స్ కలిగిన ఈ యాప్ ద్వారా వినియోగదారుని ఆహారపు అలవాట్లు, తీసుకునే ఆహారంలో ఉండే పోషకాల విలువ, అందులోని కార్బన్ ఫుట్ ప్రింట్ పరిమాణం వంటివన్నీ తెలుసుకోవచ్చు.
ఈ సందర్భంగా డాక్టర్ హేమలత మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికత కలిగిన ఈ యాప్ ద్వారా వ్యక్తిగత ఆహారపు అలవాట్లను అంచనా వేయవచ్చని చెప్పారు. తీసుకునే ఆహారం, శరీరానికి అందుతున్న క్యాలరీలు, చేయాల్సిన వ్యాయామం, శారీరక శ్రమను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలు ఉందని తెలిపారు. మన ఆహారపు అలవాట్లు పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని కూడా తెలుసుకునేలా ఈ యాప్ను రూపొందించారని అన్నారు.
సెంటర్ ఫర్ ైక్లెమెట్ రెసిలియన్స్ చైర్మన్ ప్రొఫెసర్ మార్కస్ కెక్ మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు, పోషకాహారంపై అవగాహన పెంచడంలో ఈ యాప్ ఎంతగానో సహకరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎన్ఐఎన్ సైంటిస్ట్ డాక్టర్ సుబ్బారావు, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ లీనా హెన్స్, వినీత్సింగ్ తదితరులు పాల్గొన్నారు.