హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తున్నది. నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో ఉప్పల్ చిలుకానగర్లోని హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడిచేశారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పర్వతపురంలోని చైతన్య మహిళా సంఘం నేత దేవేంద్ర, అంబేద్కర్ పూలే యువజన సంఘం అధ్యక్షుడు కిరణ్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నర్సింగ్ విద్యార్థిని రాధ రెండేండ్ల క్రితం ఏపీలోని విశాఖలో తప్పిపోయింది. దీంతో ఆమె తల్లి విశాఖపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులు (సీఎంఎస్) తన కూతురిని కిడ్నాప్ చేశారని, బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని అందులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, అడ్వకేట్ శిల్ప తమ ఇంటికి వచ్చేవారని, వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురిని తీసుకెళ్లిందని ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు.. కేసును ఎన్ఐఏకు అప్పగించారు. దీని ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ కేసు రిజిస్టర్ చేసింది. దీంతో శిల్ప, దేవేంద్రతోపాటు కిరణ్ ఇండ్లలో ఎన్ఐఏ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నది.
మెదక్ జిల్లాలోని చేగుంటలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో సోదా చేస్తున్నారు. పలు కేసులకు సంబంధించి ఆధారాల కోసం గురువారం తెల్లవారుజాము నుంచే తనిఖీ చేస్తున్నారు.