హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్యపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చార్జ్జిషీట్ దాఖలు చేసింది. మావోయిస్టు రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని సీపీఐ(మావోయిస్టు) పార్టీకి మద్దతుగా ప్రసంగించారనే ఆరోపణలపై గత ఏడాది డిసెంబర్లో ఎన్ఐఏ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ‘ఉపా’ కింద కేసులు నమోదు చేసింది.
ఇన్నయ్యకు మావోయిస్ట్ పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో వారిని ఆయన కలిసేవాడని దర్యాప్తులో తేలినట్టు ఎన్ఐఏ తెలిపింది. ఇన్నయ్య మావోయిస్టు సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో పాల్గొన్నట్టు విచారణలో తేలినట్టు పేర్కొన్నది. తదుపరి విచారణ కొనసాగుతున్నదని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.