TG Weather | తెలంగాణలో మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కీం, ఒడిశా, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసిపోందని పేర్కొంది.
ఈ క్రమంలో తెలంగాణలో మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.