TS Weather Report | రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వడగళ్లతో వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్కర్నూల్ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వానలు కురుస్తాయంటూ ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి శుక్రవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి.