హైదరాబాద్ : కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. వచ్చే 2 నుంచి 4 వారాలు కీలకమని చెప్పారు. ప్రస్తుతం అన్ని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, ఇది మూడో వేవ్కు సంకేతమని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చిచెప్పారు.
కోఠిలోని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. గత రెండు సంవత్సరాల నుంచి మీడియా అందిస్తున్న సహకారం మరువలేనిది. మీడియా ప్రతినిధులకు, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నీతి ఆయోగ్ విడుదల చేసిన హెల్త్ ఇండెక్స్లో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ క్రెడిట్ అంతా వైద్యారోగ్య సిబ్బందిదే. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం అని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
గత రెండేండ్ల నుంచి కరోనా మీద పోరాటం చేస్తున్నాం. చాలా వరకు విజయం సాధించాం. 2021 ప్రారంభంలో డేల్టా వేరియంట్తో సెకండ్ వేవ్ ఉధృతమైంది. రాబోయే రోజుల్లో మూడో వేవ్ నుంచి ప్రజలను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ రెండు, మూడు రోజుల్లో అమెరికాలో 4 లక్షలకు పైగా కేసులు, ఫ్రాన్స్లో 2 లక్షల కేసులు, యూకేలో లక్షకు పైగా కేసులు, స్పెయిన్లో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి. స్వల్ప సమయంలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. 130 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది. మన దేశంలో కూడా 19 శాతం కేసులు అధికం అయ్యాయి. నిన్న ఒక్కరోజే 13 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వేరియంట్ డేల్టా వేరియంట్ కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందింది. కొన్ని పరిశోధనల ప్రకారం 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని తేలింది. అమెరికాను ఉదాహరణకు తీసుకుంటే.. మూడు, నాలుగు రోజుల క్రితం ఒక లక్ష, రెండు లక్షల కేసులుంటే.. ఒకే రోజు 5 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. సౌతాఫ్రికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇది మూడో వేవ్ ఆరంభానికి ఒక సూచిక అని చెప్పొచ్చు.
తెలంగాణలోనూ పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు కీలకమైనవి. ఈ కేసుల పెరుగుదల ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. టీకా తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి రక్షణ పొందొచ్చు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలి. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకు ముందు ఎప్పుడూ చూడనంతగా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సుమారు 90 శాతం మందిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడం లేదు. కేవలం 10 శాతం మంది మాత్రమే వ్యాధి లక్షణాలతో కనిపిస్తున్నారు. వీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అని డాక్టర్ శ్రీనివాస్ రావు విజ్ఞప్తి చేశారు.