మహదేవపూర్ / పలిమెల, ఫిబ్రవరి 22 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరముక్తీశ్వర క్షేత్రం సమీపంలో మరో త్రివేణి సంగమం తాజాగా వెలుగులోకి వచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర సరిహద్దు సమీపం లో సోమనూరు పరిధిలోని సోమనాథ శివేశ్వరాలయం వద్ద గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదులు కలుస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఇటీవల వరంగల్కు చెందిన చరిత్ర, పురావస్తు పరిశోధకులు సీహెచ్ శ్యాం సుందర్, ఎస్ సురేందర్, నాగేశ్వరరావు ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఈ సంగమం ప్రాధాన్యతను వివరించారు.
గోదావరిలోకి ప్రాణహిత, ఇంద్రావతి నదులు కలిసే ప్రదేశానికి ఆధ్యాత్మికంగా, భౌగోళికంగా ఎంతో ప్రా ధాన్యం ఉన్నదని, ఈ సంగమాన్ని స్థానికులు ‘త్రివేణి సంగమం’గా పిలుస్తున్నా, వరంగల్, పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ విషయం తెలియదని వారు పేర్కొన్నారు. సోమనాథ శివేశ్వరాలయం పురాతన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని, ఏటా మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఇకడికి తరలివస్తారని తెలిపారు. త్రివేణి సంగమంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.