న్యూఢిల్లీ, జూన్ 18: దేశంలో కరోనా చాపకిందనీరులా విస్తరిస్తున్నది. తాజాగా శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో 13,216 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం 113 రోజుల్లో ఇదే తొలిసారి. తాజా కేసులను కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 4,32,83,793కి పెరిగింది. వీరిలో 68,108 మంది చికిత్స పొందుతున్నారు. మిగతా వారంతా కోలుకున్నారు. వ్యాధిబారిన పడినవారిలో తాజాగా 23 మంది మరణించారు. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్సాకాగ్ స్పందించింది. కరోనా నిర్ధారణ కోసం సేకరించిన శాంపిల్స్ను ఎక్కువ మొత్తంలో తమకు పంపాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ముఖ్యంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల నుంచి శాంపిల్స్ పంపాలని సూచించింది. ఏదైనా కొత్త వేరియంట్ వచ్చిందా? లేక కరోనా వేగం పెరుగుతున్నదా? తదితర విషయాలను తెలుసుకోవడానికి ఈ శాంపిల్స్ అత్యంత కీలకమని తెలిపింది.