హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రఖ్యాత వస్త్ర తయారీ కేంద్రం సిరిసిల్లలో ఉత్పత్తయ్యే ‘రాజన్న సిరిపట్టు’ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కార్మికులు తయారు చేసిన ఈ పట్టు చీరలను ఈనెల 17న న్యూజిలాండ్లో అక్కడి మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ మంత్రికి రాష్ట్ర చేనేత,జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియో సందేశం ఇచ్చారు. ‘సిరిసిల్ల నేతన్నల ఉత్పత్తులు ప్రపంచ వేదికలపై ఆవిష్కరించడం అత్యంత సంతోషాన్ని ఇస్తున్నది. ‘రాజన్న సిరిపట్టు’కు మంచి భవిష్యత్తు ఉండాలి. అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలు అం దిస్తాం. ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు..ఇవ్వాళ వినూత్న ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే స్థాయికి చేరుకున్నారు’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.
ఒక్కరితో ప్రారంభమై..40 మందికి ఉపాధి
నాలుగేండ్ల క్రితం బతుకమ్మ చీరల తయారీని చూసేందుకు రాష్ర్టానికి వచ్చిన బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీతావిజయ్ సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ గురించి తెలుసుకొన్నారు. ఆయనతో పట్టుచీరలు తయారు చే యించి.. యూఎస్, యూకే, న్యూజిలాండ్ వంటి ఆరు దేశాల్లో సిరిసిల్ల పట్టుచీరలకు ఆర్డ ర్లు ఇప్పించారు. సిరిసిల్ల పట్టుచీరలకు ప్రత్యేక బ్రాండ్ తీసుకురావాలని ‘రాజన్న సిరిపట్టు’గా నామకరణం చేసి, న్యూజిలాండ్లో ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్తో ఆవిష్కరింపజేశారు. 300 మంది ప్రవాస భారతీయుల సమక్షంలో సిరిసిల్ల నేతన్నల ఉత్పత్తులను ప్రదర్శించడంతోపాటు ఫ్యాషన్ షో నిర్వహించారు. హరిప్రసాద్తో మొదలైన పట్టుచీరల ఉత్పత్తి జిల్లాలో 40 మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నది.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కొత్తపుంతలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతున్నది. రూ. 3వేల కోట్ల విలువైన బతుకమ్మ చీరలు, క్రిస్మ స్, రంజాన్ కానుకలతోపాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫారాల తయారీ ఆర్డర్లతో చేతినిండా ఉపాధి లభించింది. సిరిసిల్ల సాంచాలను ఆధునికీకరించి కొత్త డిజైన్లతో విపణిలో బ్రాండ్ ఇమేజ్గా సిరిసిల్ల పేరు నిలపాలన్న మంత్రి కేటీఆర్ ఆశయం నెరవేర్చేందుకు నేతన్నలు నైపుణ్యానికి పదును పెడుతున్నారు. చేనేత మగ్గాలపైనే తయారయ్యే పట్టుచీరలను జకార్డు సాంచాలపై తయారు చేస్తూ రికార్డు సృష్టిస్తున్నారు. నేత కార్మికులు నల్ల విజయ్, వెల్ది చక్రపాణి అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే పట్టుచీర తయారు చేసి పలు అవార్డులు అందుకొన్నారు.
బతుకమ్మకు పట్టుచీరలే ధరిస్తా
‘రాజన్న సిరిపట్టు’ చీరలను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉన్నది. పట్టుచీరలు అంటే ఎంతో ఇష్టం. బతుకమ్మ సంబురాలకు హాజరైనపుడు వాటినే ధరిస్తా. హరిప్రసాద్తోపాటు అక్కడి నేతన్నల నైపుణ్యం వల్ల సిరిసిల్ల కేంద్రంగా బతుకమ్మ చీరలతోపాటు అగ్గిపెట్టెలో ఇమిడే చీర, వివిధ కళాకృతులు, వినూత్న చీరలు తయారు చేస్తున్నారు.
-ప్రియాంక రాధాకృష్ణన్, న్యూజిలాండ్ మంత్రి