హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం సవరించిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం తొలిసారి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల మార్కెట్ విలువను మంగళవారం సవరించిన విషయం తెలిసిందే. భూముల విలువను మూడు శ్లాబులుగా విభజించి విలువ తక్కువ ఉన్నచోట 50 శాతం, మధ్యస్థంగా ఉన్న చోట 40 శాతం, ఎక్కువగా ఉన్నచోట 30 శాతం పెంచింది. కనీస విలువను సవరించింది. రిజిస్ట్రేషన్ రుసుమును 7.5 శాతానికి పెంచింది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ధరణి పోర్టల్లో మార్పులు చేసింది.
30 వేల మందిపై అదనపు రుసుం
ధరణి పోర్టల్లో ఈ నెల 20వ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్చేసుకున్నవారు పెరిగిన చార్జీలకు అనుగుణంగా అదనపు రుసుం చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు ధరణి పోర్టల్లో ‘అడిషనల్ పేమెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ మార్కెట్ వ్యాల్యూ (ఇప్పటికే బుక్ చేసిన స్లాట్ల కోసం అదనపు చెల్లింపులు)’ పేరుతో ఆప్షన్ను అందుబాటులో ఉంచింది. స్లాట్ బుక్చేసుకున్నవారు సిటిజన్ లాగిన్లో ఈ ఆప్షన్ ఎంచుకోగానే అదనంగా ఎంత చెల్లించాలో కనిపిస్తుంది. ఆ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లిస్తే సరిపోతుంది. ధరణిలో రిజిస్ట్రేషన్, సక్సెషన్, పార్టిషన్ కలిపి 30,891 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు వీరంతా ఇప్పుడు అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.