హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు రైళ్లలో వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రయాణికుల కోసం నగర శివారులోని చర్లపల్లి వద్ద కొత్త రైల్వే టెర్మినల్ నిర్మిస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి ప్రకటించారు. మచిలీపట్నం వరకు పొడిగించిన ధర్మవరం-విజయవాడ ఎక్స్ప్రెస్ రైలును విజయవాడలో మంగళవారం జెండాఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాల్లో కొత్త లైన్ల ఎలక్ట్రిఫికేషన్, ట్రిప్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల కోసం నిరుడు కంటే ఈసారి 20 శాతం అధిక నిధులు కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో రైల్వే విభాగానికి బడ్జెట్లో రూ.8,600 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో ఏపీలో 58 కిలోమీటర్లు మాత్రమే కొత్త లైన్లు వేస్తే, మోదీ ప్రభుత్వ హయాంలో 350 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు వేశామని వివరించారు. విజయవాడ-హుబ్బళీ ఎక్స్ప్రెస్ నర్సాపురం వరకు, విజయవాడ-షిర్డీ ఎక్స్ప్రెస్ మచిలీపట్నం వరకు, విశాఖ -కాచిగూడ రైలును మహబూబ్నగర్ వరకు, విశాఖ-విజయవాడ ఎక్స్ప్రెస్ను గుంటూరు వరకు, నంద్యాల-కడప ఎక్స్ప్రెస్ను రేణిగుంట వరకు పొడిగిస్తామని వెల్లడించారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య త్వరలో వందేభారత్ రైలు వచ్చే అవకాశముందని మంత్రి తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్లో త్వరలో అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు.