హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు ప్రొటోకాల్ ముసాయిదాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సిద్ధం చేసింది. రూల్ కర్వ్స్కు సంబంధించిన ముసాయిదా కాపీలను శుక్రవారం తెలంగాణకు, ఏపీకి అందజేసింది. దానిపై అభిప్రాయాలను తెలపాలని రెండు రాష్ర్టాలకు సూచించింది. వాస్తవానికి ఈ రెండు రిజర్వాయర్ల నిర్వహణకు కేఆర్ఎంబీ గతంలోనే ప్రొటోకాల్ను రూపొందించింది. అందులోని రూల్ కర్వ్స్పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ అవార్డును పట్టించుకోకుండా కేవలం ఏడేండ్ల కాలంలో జరిగిన జల వినియోగాల ఆధారంగా ప్రొటోకాల్ను రూపొందించడం ఏమిటని తప్పుబట్టింది. నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు పూర్తిగా ఒకదానిపై ఒకటి ఆధారపడినందున ఆ ప్రొటోకాల్ను వెంటనే సవరించాలని తేల్చిచెప్పింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుతోపాటు ప్లానింగ్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా కొత్త ప్రొటోకాల్ను రూపొందించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ కొత్త ప్రొటోకాల్ ముసాయిదాను రూపొందించి, ఇరు రాష్ర్టాలకు అందజేసింది.