హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణకు వీలుగా నూతన పే రివిజన్ కమిటీ (పీఆర్సీ)ని ఏర్పాటు చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) ప్రభుత్వాన్ని కోరింది. 2023 జూలై 1 నుంచి అమలయ్యేలా నూతన పీఆర్సీ కమిషన్ను నియమించాలని విజ్ఞప్తి చేసింది. నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ అధ్యక్షతన సోమవారం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. పీఆర్సీ ఏర్పాటు, ఒక శాతం చందాతో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, ఉద్యోగులకు పదోన్నతులు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గచ్చిబౌలిలో ఇండ్ల స్థలాలు, సచివాలయంతోపాటు అన్ని జిల్లా కలెక్టరేట్లలో టీఎన్జీవో కార్యాలయాల ఏర్పాటు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వో, వీఆర్యేల సమస్యల పరిష్కారం, పాత జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ను స్ట్రెంథ్ చేయడం తదితర తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, ముత్యాల సత్యనారాయణగౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేని, హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు శ్రీరామ్తోపాటు వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.