హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): మత్స్యకారులపై దాడులకు పాల్పడినా, మత్స్య సంపదకు నష్టం కలిగించినా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారంపై శనివారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో గంగపుత్ర, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారులపై దాడుల ఘటనలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కఠిన చట్టాల అమలుకు కృషి చేస్తానని తెలిపారు. మత్స్యరంగ పరిరక్షణకు సమగ్ర పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మత్య్సకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, సొసైటీల్లో నెలకొన్న సమస్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ లచ్చి రాం భూక్యా, గంగపుత్ర, ముదిరాజ్ సం ఘ ప్రతినిధులు దీటి మల్లయ్య, చప్పొరి శంకర్, ధన్రాజ్, మోహనకృష్ణ, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గొర్రెల పంపిణీకి డీడీలు చెల్లించండి
గొర్రెల పంపిణీకి అర్హులైన వారు వీలైనంత త్వరగా డీడీలు చెల్లించాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రెండోవిడత గొర్రెల పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో డీడీలు చెల్లించినవారికి గొర్రెలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రెండోవిడతలో చాలామంది ఇప్పటివరకు డీడీలు చెల్లించలేదు. దీంతో అర్హులైనవారు డీడీలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు. రెండోవిడత పంపిణీలో భాగంగా గొర్రెల యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచారు. దీంతో లబ్ధిదారులు చెల్లించాల్సిన డీడీ మొత్తం రూ.43,750కి పెరిగింది. ప్రభుత్వం రూ.1,31,250 భరిస్తున్నది. రెండోవిడత కోసం రూ.6వేల కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.