హైదరాబాద్: బిడ్డకు జన్మనిచ్చి కోమాలోకి వెళ్లిన ఓ బాలింతకు హైదరాబాద్ వైద్యులు అత్యంత అరుదైన ఆపరేషన్ చేసి పరిస్థితిని చక్కదిద్దారు. వైద్యుల చలవతో ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. హైదారాబాద్లోని సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాలోని తెట్టెకుంట గ్రామానికి చెందిన సత్యవతి (27) అనే గర్భిణికి గత జూన్లో అధికంగా రక్తస్రావం జరుగడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే, ఆమె పరిస్థితిని పరిశీలించిన వైద్యులు కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి రిఫర్ చేశారు. దాంతో గత జూన్ 21న సత్యవతి కింగ్ కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. అప్పటి నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలో అక్కడే చికిత్స తీసుకుంది. ఈ క్రమంలోనే గత బుధవారం సత్యవతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, అప్పుడే పుట్టిన తన బిడ్డను కనీసం చేతుల్లోకి కూడా తీసుకోకుండా సత్యవతి కోమాలోకి వెళ్లింది.
ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుండటం, రక్తపోటు మరీ తక్కువగా ఉండటం, హృదయస్పందన రేటు కూడా మందగించడం లాంటివి సత్యవతి కోమాలోకి వెళ్లడానికి కారణమయ్యాయని వైద్యులు తెలిపారు. అయితే, సత్యవతి కోమాలోకి వెళ్లిన కొన్ని క్షణాల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి సహా సీనియర్ డాక్టర్లంతా అప్రమత్తమయ్యారు. వెంటనే అత్యంత అరుదైన ఎక్స్ప్లోరేటరీ లాపరోటోమీ సర్జరీ చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ను కంట్రోల్ చేశారు.
దాదాపు రెండు గంటలపాటు సర్జరీ జరిగిందని, సర్జరీ కోసం మొత్తం 13 యూనిట్ల రక్తం అవసరమైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు. కాగా, ఎక్స్ప్లోరేటరీ లాపరోటోమీ అనేది ఉదరాన్ని ఓపెన్ చేసి చేసే అరుదైన ఆపరేషన్ అని, ఎంతో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి ఆపరేషన్ చేస్తారని వైద్యులు వెల్లడించారు.