హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలం వావికొల్లు గ్రామంలో చారగొండవాగు పక్కనున్న పొలాల్లో ఉదయనచోడుని కొత్త శాసనం బయల్పడింది. ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు శాసనం ఫొటోలను పంపించారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. తెలుగులిపి, భాషలో 81 పంక్తుల్లో చెక్కిన ఈ శాసనం కల్యాణీచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లదేవ బిరుదాంకితుడు 2వ జగదేకమల్ల పాలనాకాలంలో ఆయన సామంతుడు కందూరు ఉదయనచోడ మహారాజు వేయించినదని చెప్పారు. ఉదయనచోడుడు తన పురోహితుడైన సర్వదేవ సోమయాజులకు శక సం.1080లో బోడవిప్పఱ్ఱు గ్రామాన్ని దానం చేసినట్టు ఈ శాసనం వివరిస్తున్నదని చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న పానుగల్లు రాజధానిగా కందూరుచోడులు కల్యాణీచాళుక్యులకు, కాకతీయులకు సామంతులుగా 250 ఏండ్లు పాలించారని పేర్కొన్నారు. ఉదయనచోడుని శాసనాల్లో ఇది మూడోదని హరగోపాల్ పేర్కొన్నారు.