హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): మెడికల్ విద్యార్థుల కోసం కొత్త పాఠ్య ప్రణాళికను అమలు చేయాలని పలువురు వైద్యవిద్యావేత్తలు పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి 8 వరకు నగరంలోని భాస్కర్ మెడికల్ కాలేజీలో మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీల వార్షిక సదస్సు నిర్వహించారు. ఏజిస్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనిస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు 10 రాష్ర్టాల నుంచి 45 మెడికల్ కాలేజీలకు చెందిన 250 సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా నాణ్యమైన శిక్షణకు పాఠ్యాంశాల సంస్కరణల అమలు, సాంకేతిక పాత్ర, కమ్యూనిటీ ఓరియెంటేషన్, కృత్రిమ మేధస్సు వంటి తదితర అంశాలపై చర్చించారు. వైద్య విద్యార్థుల్లో విలువలు, వృత్తి నైపుణ్యతను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ సదస్సులో జేబీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సంస్థల సలహాదారు డాక్టర్ బీ దీపిక, ఎస్ఆర్ఐహెచ్ఈఆర్ వీసీ డాక్టర్ పీవీ విజయరాఘవన్, భాస్కర్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జీవీఎస్ మూర్తి, డీన్ చలం తదితరులు పాల్గొన్నారు.