హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ప్రజా సంక్షేమ పథకాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలుతోపాటు దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఎంతో కీలకమైన అఖిల భారత గృహ వినియోగదారుల వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)ను నరేంద్రమోదీ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ఫలితంగా గత తొమ్మిదేండ్ల నుంచి దేశంలో ఎలాంటి ప్రజా సంక్షేమ పథకాలు, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు లేవు. బలమైన ఆర్థికశక్తిగా ఎదిగేందుకు భారత్లో వనరులు పుష్కలంగా ఉన్నా అన్ని రంగాల్లో వెనుకబాటే. దీంతో దేశంలోని సామాన్యుల జీవన స్థితిగతులు దారుణంగా దెబ్బతిన్నాయని అనేక సర్వేలు ఘోషిస్తున్నాయి. చివరికి కేంద్రం ఆధీనంలోని నీతి ఆయోగ్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది.
దేశంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోవడంతో అనేక సర్వేలను మోదీ సర్కార్ ఆదిలోనే తొక్కేస్తున్నద న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కుబడిగా కొన్ని సర్వేలు నిర్వహించినా ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో వాటినీ రహస్యంగా దాచేస్తున్నది. అందులో భాగంగానే హెచ్సీఈఎస్ వివరాలను వెల్లడించడం లేదు. 2017-18లో ఈ సర్వే నిర్వహించినా ఇప్పటికీ ఆ వివరాలను గోప్యంగా ఉంచారు. దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతినడం, పేదల బతుకు మరింత దుర్భరంగా మారడం, తలసరి ఆదాయం తగ్గినట్టు ఈ సర్వేలో తేలడం వల్లనే ఫలితాలను వెల్లడించడం లేదని ఎంతో మంది మేధావులు తప్పుబడుతున్నారు. అయినా కేంద్రం ఈ ఫలితాలను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
దేశంలోని ప్రజల స్థితిగతులు, ఆదాయ, వ్యయాలను తెలుసుకునేందుకు కేంద్రం ఐదేండ్లకోసారి జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్వో) ద్వారా హెచ్సీఈఎస్ను నిర్వహిస్తున్నది. ఎన్ఎస్వోలో కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్వో), నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్వో) భాగస్వాములుగా ఉంటాయి. 1972-73 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ సర్వేను ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక మంది ప్రధాన మంత్రులు వచ్చినప్పటికీ హెచ్సీఈఎస్ను ఎవరూ నిర్ల క్ష్యం చేయలేదు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ ప్రతి ఐదేండ్లకోసారి జూన్ నుంచి మరుసటి సంవత్సరం జూలై వరకు ఈ సర్వే నిర్వహించి పేదరిక విసృ్తతితోపాటు గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో ఆహారం, వస్తువులు, సేవల వినియోగిత, వాటి నిష్పత్తి, తలసరి ఖర్చులు, జీవన ప్రమాణ స్థాయిలను అంచనా వేస్తారు. దేశంలో సగటు గ్రామీణ నెలవారీ తలసరి ఖర్చు రూ.1,430గా, పట్టణ ప్రాంత నెలవారీ తలసరి ఖర్చు రూ.2,630గా ఉన్నట్టు 2011-12 సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ సగటు దాదాపు 84% ఎకువగా ఉన్నట్టు వెల్లడైంది. గ్రామీణ కుటుంబాలు తమ సగటు వ్యయంలో విద్యకు 3.5% వెచ్చిస్తున్నట్టు ఈ సర్వే పేర్కొనడంతో నాటి కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసింది.
ఆ తర్వాత 2017లో మోదీ సర్కార్ హెచ్సీఈఎస్ సర్వే నిర్వహించినప్పటికీ ఫలితాలను మాత్రం వెల్లడించలేదు. వాటిని బయట పెట్టాలని విపక్షాలతోపాటు ఎంతో మంది మేధావులు అడిగినా స్పందించలేదు. సర్వే విధానం అసమగ్రంగా ఉన్నదని, డాటా సరిగా లేదని కుంటిసాకులు చెప్పి హెచ్సీఈఎస్ వివరాలను దాచిపెట్టింది. దీంతో నేటికీ దేశంలో 2011-12 సర్వే ఆధారంగానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నిరుడు జూన్లో మళ్లీ హెచ్సీఈఎస్ను మొదలుపెట్టినప్పటికీ అది ఏ స్థాయిలో జరుగుతున్నదో తెలియడం లేదు. ఈ సర్వే ఫలితాలనైనా కేంద్రం వెల్లడిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.