హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణ, అమలు తీరుపై పరిశోధనకు బీఆర్ఎస్ యువజన విభాగం నేత నేవూరి ధర్మేందర్రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది. ప్రభుత్వ పాలనా శాస్త్రం నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన ఆయనకు డాక్టరేట్ వరించింది. ధర్మేందర్ తన పరిశోధనలో భాగంగా నల్లగొండ జిల్లాను కేస్స్టడీగా తీసుకొని ఈ పథకం ద్వారా పేదరిక నిర్మూలన, ఉద్యోగుల పాత్రపై కూలంకషంగా పరిశోధనలు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని దాచారం గ్రామానికి చెందిన ధర్మేందర్ తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్వీ నేతగా చురుకైన పాత్ర పోషించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడిగా కొనసాగుతున్నారు. డాక్టరేట్ రావడం పట్ల పలువురు ధర్మేందర్ను ప్రత్యేకంగా అభినందించారు.