(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : కరెంట్పై కుట్రలతో రైతును చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్న రేవంత్ సర్కార్పై నెటిజన్లు సోషల్మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. ‘కాంగ్రెస్ హఠావో.. కిసాన్ బచావో’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. రుణమాఫీ, రైతుబంధును అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పంట బోనస్ ఎగ్గొట్టేందుకే కరెంట్ కుట్రలకు తెరతీసిందని రమేశ్ అనే ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఎరువుల సరఫరా, పంట కొనుగోలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిన్న మోటర్లకు మీటర్లు.. ఇప్పుడు విద్యుత్తు సరఫరాలో కొర్రీలకు తెగబడుతూ దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నదని తెలంగాణవాది అనే ఎక్స్ ఖాతాలో పోస్టు కనిపించింది. ఇక రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. తెలంగాణ జెన్జడ్ ఖాతాలో ‘కాంగ్రెస్ హఠావో.. కిసాన్ బచావో’ అనే పోస్టు వైరల్గా మారింది. ‘కరెంట్ ఇవ్వకపోతే పంట పండదు.. అప్పుడు ధాన్యం కొనుగోలు సమస్య ఉండదన్న కారణంతోనే కాంగ్రెస్ సర్కార్ ఇలా చేస్తున్నది’ అంటూ మనోహర్ అనే నెటిజన్ పోస్ట్ చేశారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, నరుకుడు తప్ప రేవంత్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని చందు అనే నెటిజన్ మండిపడ్డాడు.