కరీంనగర్, మే 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్ సిటీబ్యూరో(నమస్తే తెలంగాణ): బాలికపై తన కుమారుడు బండి భగీరథ్ చేసిన అఘాయిత్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న జిమ్మిక్కులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బాధిత కుటుంబంపై కేసు పెట్టి వారిపై కక్షసాధింపు చర్యలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. తన కుమారుడిని మందలించాల్సింది పోయి.. తనపైనే కక్ష చేస్తున్నారని అంటూ బండి సంజయ్ గొంతు చించుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దేశ శాంతిభద్రతలను పరిరక్షిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. తన ఇంటి వరకు వచ్చేసరికి చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘భారత్ మాతాకీ జై’ అంటూ వేదికలపై మహిళాభక్తిని చాటుకొనే నేత సొంత కొడుకు.. ఒక ఆడబిడ్డ జీవితంతో ఆడుకుంటా ఆమెకు నరకం చూపించారని ప్రజలు మండిపడుతున్నారు.
పైగా పోక్సో కేసు నేపథ్యంలో బండి సంజయ్ ఈ నెల 9న తన అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లో పెట్టిన పోస్టుపైనా మెజారిటీ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కొడుకుపై పోక్సో కేసు నమోదైతే ఏ ముఖం పెట్టుకొని ప్రధాని మోదీ వద్దకు వెళ్తావు. ఏమాత్రం శరం ఉన్నా.. వెంటనే నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని నెటిజన్లు డిమాండ్ చేశారు. కేంద్రానికి ఏమాత్రం చిత్తుశుద్ధి ఉన్నా బండిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇదంతా ఎందుకు తడి బట్టలతో భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడిలో ప్రమాణం చేయి. నీ కొడుక్కి ఏమీ తెలియదు’ అని ఓ నెటిజన్ మండిపడ్డారు. ‘అన్నా.. ఈ రోజు ఏ వారం అన్నా.. అపర ‘భగీరథు’డు దొరికేశాడు! అంటూ ఇంకొకరు పోస్టు పెట్టారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పావుగా.. మరి నీ కొడుకు సుద్దపూసనా అంటూ ప్రశ్నించారు. ‘అందులో ఎటువంటి కుట్రలు లేవు.. నీ కొడుకు తప్పు చేశాడు. అది దేశం మొత్తం తెలిసిపోయింది. ఇంకా వెనుకొస్తే ఎలా?’ అంటూ ఒకరు పోస్టు పెట్టారు. ‘ముందునుంచీ సాయి భగీరథ్ చాలా చక్కని అబ్బాయి. ఎవరినీ తిట్టడు. కొట్టడు. నోట్లో వేలు పెట్టినా కొరకుడు’ అంటూ మరొకరు వ్యంగంగా పెట్టారు. ‘బీసీలు అన్యాయంగా బలైనప్పుడు నీ బీసీవాదం ఎక్కడపోయింది బాస్’ అంటూ ప్రశ్నించారు.