●జిల్లాకో వైద్య కళాశాల నిర్మిస్తున్నది కేసీఆర్
●అది మోదీ విజన్ అంటూ గవర్నర్ ప్రచారం
●నాగర్కర్నూల్లో ఏర్పాటుచేస్తున్నట్టు ట్వీట్
●తమిళిసై ట్వీట్పై మండిపడుతున్న నెటిజన్లు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): మెడికల్ కాలేజీలు ఇవ్వాలని అడిగితే ఇవ్వరు. మనమే మన డబ్బులతో పెట్టుకొంటుంటే.. అదిగో.. అవి మావేనంటూ ప్రచారం చేసుకొంటుంటారు. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాష్ట్రంలో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీల విషయంలో చేసిన ట్వీట్ ఇందుకు మరో ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదు. అయినా సరే.. రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర నిధులతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభించారు. నాలుగు కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
మరో 8 కాలేజీలను ఈ ఏడాది ప్రారంభించబోతున్నారు. వీటిని తమ ఖాతాలో వేసుకొనేందుకు బీజేపీ ఉబలాటపడుతున్నట్టున్నది. నాగర్కర్నూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న మెడికల్ కాలేజీని వచ్చే నెల మూడో వారంలో జాతీయ మెడికల్ కౌన్సిల్ పరిశీలించనున్నది. ఏడాదికి 150 మంది విద్యార్థులతో ఎంబీబీఎస్ బ్యాచ్ను తేవానే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దీనిని గవర్నర్ తమిళిసై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ క్రెడిట్గా అభివర్ణించారు. ‘ప్రధాని మోదీ విజన్ మేరకు తెలంగాణకు కొత్త మెడికల్ కాలేజీలు మంజూరవుతున్నాయి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దిశగా అడుగులు పడుతున్నాయి’ అని ట్వీట్ చేశారు. గవర్నర్ తమిళిసై ట్వీట్పై నెటిజన్లు, తెలంగాణ మేధావులు విమర్శిస్తున్నారు.
‘సొమ్ము తెలంగాణది.. సోకు కేంద్రానిది అన్నట్టు ఉన్నది’ అంటూ చురకలు అంటించారు. కేంద్రం మూడు దశల్లో మొత్తం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్కు 26, రాజస్థాన్కు 23, మధ్యర్పదేశ్కు 12, పశ్చిమ బెంగాల్కు 12, తమిళనాడుకు 11.. ఇలా అనేక బీజేపీ పాలిత/ అనుకూల రాష్ర్టాలకు కేంద్రం మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నది. కానీ న్కు తెలంగాణ ప్రభుత్వం ఆరేండ్ల పాటు విన్నవించినా ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. ఈ విషయాన్ని తెలంగాణ మేధావులు గవర్నర్కు గుర్తు చేస్తున్నారు. పైగా తమిళనాడులో 11 మెడికల్ కాలేజీలను ప్రధాని మోదీ ఒకేసారి ప్రారంభించారు. మరి ఆ సమయంలోనైనా పక్కనే ఉన్న తెలంగాణకు ద్రోహం చేశామే అన్న భావన ఇసుమంతైనా కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు గవర్నర్గా ఉంటూ.. తెలంగాణకే అన్యాయం చేస్తారా? అంటూ తమిళిసైని నిలదీస్తున్నారు. మరోవైపు బీబీనగర్లోని ఎయిమ్స్కు 1,028 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేయగా కేంద్రం కేవలం రూ.28.16 కోట్లు మాత్రమే విడుదల చేసిందని విమర్శిస్తున్నారు.
సొంత నిధులతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేనాటికి కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. సీఎం కేసీఆర్ కొత్తగా మహబూబ్నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో 4 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేశారు. ఒకో కాలేజీకి రూ.450 కోట్ల దాకా ఖర్చు చేశారు. రెండో దశలో ఏకకాలంలో 8 చోట్ల సంగారెడ్డి, వనపర్తి, నాగర్కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తున్నారు. ఒకో కాలేజీ ఏర్పాటుకు రూ. 510 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటిల్లో ఈ ఏడాది నుంచే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 17కు పెరిగింది. మిగతా జిల్లాల్లో 8 ఈ ఏడాది, మరో 8 వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తారు.