హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): నాడు యావత్ ప్రపంచాన్నే ఆకర్షించిన వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ మరోసారి అవమానించింది. రాష్ట్ర ప్రభుత్వ జాతీయ సమైక్యతా ఉత్సవాలకు పోటీగా శనివారం సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించిన సభలో తెలంగాణ అమరవీరులను, రైతాంగ సాయుధ పోరాట ఘట్టాలను విస్మరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొన్న ఈ సభావేదికపై ఎక్కడా సాయుధ పోరాటాన్ని ప్రతిబింబించే ఫొటోలు పెట్టలేదు. కనీసం తెలంగాణ అమరవీరుల చిత్రాలకు స్థానం ఇవ్వలేదు. కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి వల్లభాయ్ పటేల్తోపాటు ప్రధాని మోదీ, అమిత్షా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఫొటోలతో నింపేశారు. ప్రాంగణంలో పటేల్ నిలువెత్తు ప్రతిమను పెట్టారు. కేవలం పోలీస్ చర్య వల్లే తెలంగాణకు విముక్తి లభించిందనేలా కార్యక్రమం ఆద్యంతం సాగింది. నాడు లక్షల మంది ఆయుధాలు చేతబూని యుద్ధం చేయడాన్ని, వేలాది మంది ప్రాణాలు అర్పించడాన్ని స్మరించుకోలేదు. తెలంగాణలో మాదిరిగా మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉత్సవాలు ఎందుకు నిర్వహించడం లేదని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
జైలుకు ఎప్పుడు పోయినవ్?
మలిదశ తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు, కొందరు కాంగ్రెస్ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. కానీ.. అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కిషన్రెడ్డి మాత్రం రాజీనామా చేయలేదు. అలాంటిది శనివారం సభలో ‘తెలంగాణ కోసం 25 ఏండ్లు పోరాటం చేసి జైళ్లకు వెళ్లాం’ అని చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు ‘అన్నా నువ్వెప్పుడు జైలుకు పోయినవ్?’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
పరేడ్గ్రౌండ్లో ఫ్లాప్ షో
పరేడ్గ్రౌండ్లో బీజేపీ సభకు ప్రజాదరణ లభించలేదు. వారం రోజుల పాటు బీజేపీ నాయకులు హడావిడి చేసినా ఫలితం దక్కలేదు. సభకు వచ్చినవారి కంటే బీజేపీ ముఖ్యనేతలు, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సంఖ్యే ఎక్కువగా ఉన్నదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. జనం నుంచి సరైన స్పందన లేకపోవడంతో అమిత్షా తీవ్రంగా నిరాశ చెందినట్టు సమాచారం. సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ శ్రేణులే చెప్తున్నాయి.