వనపర్తి : ఆయిల్ పామ్ సాగుతో రైతులకు నికర ఆదాయం లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. శనివారం ఒకే రోజు 313 ఎకరాల్లో 15వేల ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఆత్మకూరు మండలంలో 88.17 ఎకరాలు, పెబ్బేరు 42.77, కొత్తకోట 38.77, వనపర్తి 37.60, పానగల్ 30.64, అమరచింత 20.47, గోపాల్ పేట 17, మదనాపూర్ 15, పెద్దమందడి 14, శ్రీరంగాపూర్ 4.57, రేవల్లి 4.57 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.
చిట్యాల గ్రామంలో ముష్టి బాలీశ్వర్ ఐదెకరాల పొలంలో సామూహిక ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణతోనే అధిక ఆదాయం లభిస్తుందన్నారు. రైతులు సాంప్రదాయ సాగు నుంచి బయటకు రావాలన్నారు. దేశంలో బైబ్యాక్ గ్యారంటీ పాలసీ ఉన్న ఒకే ఒక పంట ఆయిల్ పామ్ అన్నారు. 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందన్నారు.
ఏటా రూ.80వేల కోట్ల విలువైన వంటనూనెలు దిగుమతి చేసుకుంటున్నామని, 79 క్షేత్ర పర్యటనల ద్వారా 8,460 మంది రైతులకు ఆయిల్ పామ్ సాగు, ఇతర విషయాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. వరి మినహా అన్ని రకాల పంటలను ఆయిల్ పామ్లో అంతరపంటలుగా సాగుచేయవచ్చని, నూనె, పప్పు గింజల సాగుపై దృష్టి పెట్టి.. ఆ దిశగా రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు.