రవీంద్రభారతి, సెప్టెంబర్ 9: తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తినిచ్చిన ప్రజాకవి కాళోజీ అని, నేటితరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 111వ జయంతి వేడుకలు, తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజీ సాహితీ పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. కాళోజీ తన జీవితకాలంలో జరిగిన ప్రతి ఉద్యమాన్నీ ఊపిరిగా మార్చుకొని, వాటిలో తన వంతు పాత్రను చురుగ్గా పోషించారని వివరించారు. సమకాలీన సమాజంపై ఆయన ప్రభావం అపారమైనదని, మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు లాంటి వారు కాళోజీ అంటే అమితమైన గౌరవాభిమానాలు చూపేవారని చెప్పారు.
సమాజ గొడవను తన గొడవగా మార్చుకున్న కాళోజీ.. ‘నా గొడవ’ పేరుతో రాసిన కవితలు సమాజానికి మార్గదర్శకాలుగా మారాయని తెలిపారు. ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప ప్రజాకవి, ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించి, చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయిన మహానుభావుడు అంటూ కాళోజీ సేవలను స్మరించుకున్నారు. కాళోజీ జీవిత చరిత్ర గ్రంథాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో, గ్రామాల్లో ఉండే విధంగా కృషిచేస్తానని చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమాలకు యువత దూ రంగా ఉండటం భాధాకరమని, మొబైల్ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో మునిగితేలుతూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో మార్పుకు కవులు, కళాకారులు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, కాళోజీ ఫౌండేషన్ సభ్యుడు పొట్లపల్లి శ్రీనివాసరావు, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి పాల్గొన్నారు.