NEET PG | మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ (NEET PG) పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో (Medical colleges) ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎన్బీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 271 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.
ఇక రాష్ట్రంలో మొత్తం 2,453 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,393, ప్రైవేటులో 1,060 సీట్లు ఉన్నాయి. ప్రవేశ పరీక్షను 10 కేంద్రాల్లో (హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, కోదాడ) నిర్వహించనున్నారు. మార్చి 31వ తేదీలోపు ఫలితాలను విడుదల చేయనున్నారు.
నీట్ పీజీ 2023 ప్రవేశపరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సు్లతోపాటు పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్బీ కోర్సులు, ఆరేండ్ల డీఆర్ఎన్బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ ఎన్బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్, ఈడబ్యూఎస్ అభ్యర్థులు 50 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 40 పర్సంటైల్ సాధించాలి.
కాగా, ఢిల్లీ ఎయిమ్స్తో పాటు దేశంలోని ఇతర ఎయిమ్స్, చండీగఢ్ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుదుచ్చేరిలోని జిప్మర్, బెంగళూరులోని నిమ్హాన్స్, త్రివేండ్రంలోని చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సంస్థల్లో అడ్మిషన్లకు నీట్ ప్రవేశ పరీక్ష వర్తించదని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ (NBE) వెల్లడించిన విషయం తెలిసిందే.