హైదరాబాద్: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పీజీ 2025 పరీక్ష (NEET PG Exam) ఆగస్టు 3న జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఇప్పటికే పూర్తిచేసింది. వచ్చే ఆదివారం (ఆగస్టు 3న) ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనుంది. అయితే పరీక్షకు 4 రోజుల ముందు అంటే జూలై 31న అడ్మిట్ కార్డులను ఎన్బీఈఎంఎస్ విడుదల చేయనుంది. గురువారం ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్సైట్ natboard.edu.in లో అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు తమన హాల్టికెట్ను తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ను ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MD), మాస్టర్ ఆఫ్ సర్జరీ (MS), పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ ఎంబీబీఎస్ డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DNB) డాక్టరేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DrNB), డిప్లామా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష రోజున విద్యార్థులను 45 నిమిషాలకు ముందే ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ పీజీ రాయనున్నారు. తెలంగాణ నుంచి సుమారు 10 వేల మంది రాసే అవకాశం ఉన్నట్లు అంచనా. వీరికోసం హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 3 నాటికి ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, జూన్ 15న రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. ఒకే షిఫ్టులో నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఎన్బీఈఎంఎస్ ఆగస్టు 3కు పరీక్షను వాయిదా వేసింది. గతేడాది దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో మొత్తం 25,791 సీట్లను కేటాయించారు.