హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సు ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ )-2023 యూజీ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. పేపర్, పెన్ను విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. https//neet.nta.nic. in/లో మార్చి 6 నుంచి ఏప్రిల్ 6లోగా దరఖాస్తులు సమర్పించాలి. జనరల్ క్యాటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1,700, జనరల్ ఈడబ్ల్యూస్/బీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ.1,600, ఎస్సీ,ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్ జండర్ అభ్యర్థులకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల అభ్యర్థులైతే రూ.9,500గా నిర్ణయించారు. నీట్ పరీక్ష మే 7న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల మధ్య ఉంటుంది.