హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): కొవిడ్ రోగుల్లో దాదాపు 50 శాతం మంది ఆక్సిజన్, పడకలు అవసరం లేకున్నా దవాఖానల్లో చేరుతున్నారని.. దీంతో బెడ్లు అవసరమైనవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు, కిమ్స్ దవాఖాన ఎండీ భాస్కర్రావు తెలిపారు. కిమ్స్లో ప్రస్తుతం 500 మంది ఆక్సిజన్ పడకలపై ఉన్నారని.. వీరిలో దాదాపు 200 మందికి వాస్తవంగా అవి అవసరం లేదని చెప్పారు. వారిని డిశ్చార్జి చేయాలనుకున్నా ప్రముఖులతో ఫోన్లు చేయించుకొని ఉంటున్నారని పేర్కొన్నారు. రోగి కి ఏ సమయంలో ఏదవసరం అనేది వైద్యులు నిర్ధారిస్తారు.. కానీ, రోగులే అనవసర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.
వెంటిలేటర్ బెడ్స్ కొరత ఏర్పడేందుకు ఇదే ప్రధాన కారణమని వివరించారు. కొవిడ్ పరిస్థితులపై బుధవారం భాస్కర్రావు వర్చువల్గా మీ డియాతో మాట్లాడారు. కిమ్స్లో 20 కేఎల్ సామర్థ్యంతో ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్ను గతంలో మూడ్రోజులకోసారి నింపేవారమని.. ఇప్పుడు 24 గంటలకోసారి నింపాల్సి వస్తున్నదని చెప్పారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రతిఒక్కరూ దవాఖానలో చేరాలనే అపోహను వీడాలని.. కచ్చితంగా ఐసీయూ బెడ్ కావాలో లేదా హోం ఐసోలేషన్ కావాలో వైద్యులే నిర్ణయిస్తారని చెప్పారు. కరోనా వచ్చిన వారిలో హృద్రోగ, మూత్రపిండ, కాలేయ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే ఎక్కువగా దవాఖానలో ఉంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.
అవసరమైతేనే హై ట్రీట్మెంట్
సోషల్ మీడియాలో వచ్చిన వాటిని చూసి రోగులు తమకు అలాగే వైద్యం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని భాస్కర్రావు ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా కొవిడ్ పాజిటివ్ రోగులు చాలామంది తమకు రెమిడెసివర్ ఇవ్వాలంటూ వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఎయిమ్స్లో ప్రతి వందమంది కొవిడ్ రోగుల్లో ఐదారుగురికి మాత్రమే ఈ మందు వాడుతుంటే.. తెలంగాణలో మాత్రం దీని వాడకం గణనీయంగా పెరిగిందని చెప్పారు. అనవసరంగా రెమిడెసివర్ వినియోగం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయన్న వాస్తవాన్ని గుర్తించాలని సూచించారు.
కరోనా కవచ్ పాలసీతో ఆర్థికంగా ఊరట
ప్రస్తుతం కరోనా వైద్య సేవలకు సంబంధించి పెద్దఎత్తున ఖర్చవుతున్నదని పేర్కొన్న డాక్టర్ భాస్కర్రావు.. ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల ఆర్థికంగా చాలా ఊరట కలుగుతుందని తెలిపారు. కరోనా వ్యాధి కోసం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రత్యేక ఇన్సూరెన్స్లను కలిపిస్తున్నాయని, కరోనా కవచ్ వంటి పాలసీలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. మీడియా కూడా దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
అన్నివిధాలుగా సర్కారు సాయం
రాష్ట్రప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో కరోనా చికిత్సను పర్యవేక్షిస్తున్నదని భాస్కర్రావు తెలిపారు. ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి? ఆక్సిజన్ ఎంత ఉన్నది? తెలుసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలోఉన్న అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ, ఇండ్లలో కచ్చితంగా ఆక్సిజన్ పైపులైన్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తద్వారా ఇలాంటి సమయంలో దవాఖానలపై భారం తగ్గడంతోపాటు రోగులకు సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు.