ముషీరాబాద్, మార్చి 2: సినీ నటుడు మోహన్బాబు నాయీబ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన నాయీబ్రాహ్మణ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోహన్బాబు నివాసంలో పదకొండు ఏండ్లుగా హెయిర్ డ్రెస్సర్గా పనిచేస్తున్న నాగ శ్రీనుపై తప్పుడు కేసులు పెట్టించి వేధించడం, కులదూషణ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. శ్రీనును మోకాళ్లపై నిలబెట్టి దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మోహన్బాబుకు బీసీలు అంటే చిన్నచూపని, తన స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్రీనుపై పెట్టించిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మాదిరిగానే వెనకబడిన వర్గాల కోసం బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని నాయీబ్రాహ్మణ సంఘాల జేఏసీ అధ్యక్షుడు బుద్దారం ధన్రాజ్ డిమాండ్ చేశారు. మోహన్బాబు నాయీబ్రాహ్మణులకు క్షమాపణ చెప్పి, అక్రమ కేసులు ఉపసంహరించుకోకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయీబ్రాహ్మణ సంఘం నేతలు నందకిషోర్, జంపాల రాజేష్, సతీశ్, వెంకట్, రాంబాబు, గురప్ప, వికాస్, అశోక్ పాల్గొన్నారు.