హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఇద్దరూ భార్యాభర్తలే.. పైగా ప్రేమించి పెండ్లిచేసుకొన్నారు. కష్టపడకుండా డబ్బుసంపాదించేందుకు ఇద్దరూ కూడబలుక్కొని అనైతిక చర్యలకు దిగారు. పలువురు నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టి చివరకు పోలీసులకు చిక్కారు. మహబూబ్నగర్ జిల్లా కోస్గికి చెందిన పున్నం నవీన్కుమార్, శిరీష దంపతులు ఫేస్బుక్లో స్వప్నరెడ్డి పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి నిరుద్యోగ యువకులకు గాలం వేశారు. తనకు టచ్లోకి వచ్చిన పెండ్లికాని నిరుద్యోగ యువకులను ఎంపికచేసుకొని వాళ్లను ప్రేమిస్తున్నట్టు శిరీష చాటింగ్చేసి ముగ్గులోకి దింపుతుంది. పెండ్లి చేసుకోవాలంటే ఉద్యోగం సంపాదించుకోవాలని షరతు పెడుతుంది.
ఆపై తనకు తెలిసిన వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తాడని తన భర్తను మధ్యవర్తిగా రంగంలోకి దింపుతుంది. అతడు నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని రూ.లక్షల్లో వసూలుచేసి ముఖంచాటేస్తాడు. ఇలా ఒక యువకుడికి ఆదాయపన్ను శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ. 8 లక్షలు లాగేయడంతో అతడు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నవీన్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం నవీన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచగా, శిరీషకు చంటిపాప ఉండటంతో నోటీసులు జారీచేశారు.