హైదరాబాద్ : తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. తెలంగాణలో పర్యటించిన కేంద్రమంత్రులు, సీఎంలు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధులు పచ్చదనం పెంపునకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ.. కితాబునిస్తున్నారని అటవీ పర్యావణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
నిన్న తెలంగాణలో పర్యటించిన ఉత్తర ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్.. హరితహారంలో నాటిన మొక్కలు, అటవీ పునరుద్ధరణ పనులు బాగున్నాయని అభినందించారని తెలిపారు.
అడవులను, వణ్యప్రాణులను కాపాడే క్రమంలో అటవీశాఖ సిబ్బంది కనబరిచిన త్యాగాలకు విలువ కట్టలేమని అటవీ శాఖ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమరులకు ఘనంగా నివాళులర్పించారు.
అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్, ఎం. డొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, అటవీ శాఖ సలహాదారు ఆర్.శోభ, రిటైర్డ్ పీసీసీఎఫ్ లు పీ. మల్లిఖార్జున్ రావు, మునీంద్ర, ఇతర అధికారులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నెహ్రూ జూలాజికల్ పార్కు వద్ద స్మారక చిహ్నంపై పుష్పగుచ్చాలు ఉంచి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అమరులైన అటవీ అధికారుల సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..1984వ సంవత్సరం నుండి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 21 మంది అటవీ అధికారులు ధైర్య సాహసాలతో, అంకిత భావంతో పని చేస్తూ అటవీ సంపదను కాపాడటంలో తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారన్నారు.
ప్రకృతి వనరులను రక్షించడంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతర సేవలందిస్తున్నారని ప్రశంసించారు. అటవీ సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇప్పటికే అటవీ సంపదను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. అమరులైన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు.