హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ, జనవరి 8: ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే నేడు దేశంలోని జాతీయ బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయాయని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ ఆరోపించారు. హైదరాబాద్ కాచిగూడలోని మ్యాడం అంజయ్య హాలులో ఆదివారం ఏఐబీఈఏ మహిళా బ్యాంకు ఉద్యోగుల ఆరో సదస్సు జరిగింది.
ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమర్జీత్ కౌర్ మాట్లాడుతూ దేశంలో ఉన్న మహిళా ఉద్యోగులు, కార్మికుల్లో 93 శాతం మందికి నేటికీ భద్రతలేదని, ఎలాంటి కార్మిక చట్టాలు అమలు కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని బలహీనపర్చడం ద్వారా ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
మోడీ పాలనలో ఉద్యోగులు, కార్మికుల హకులపై దాడి జరుగుతుతున్నదని, పని పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు నిత్యం దిగజారిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో దాదాపు 50 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే పోయాయని, ఇలాంటి చర్యలను సహిస్తే భవిష్యత్ తరాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితులు, విధానాలకు అనుగుణంగా మహిళా ఉద్యోగులు, కార్మికులు సమస్యలపై సమగ్ర ఆలోచనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మోదీ ప్రభుత్వ తిరోగమన చర్యలను సంఘటితంగా ఎదురొనేందుకు ఏఐటీయూసీ, ఏఐబీఈఏ నిరంతరం తమ పోరాటాన్ని కొనసాగిస్తాయని, అందుకు మహిళాశక్తి కూడా కలిసిరావాలని కోరారు. 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐబీఈఏ మహిళా విభాగం కన్వీనర్ లలితాజోషి, ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం, కెతావత్ మౌనిక, మీనాక్షి, టీ రవీంద్రనాథ్, పీవీ కృష్ణారావు, జీ పద్మ తదితరులు పాల్గొన్నారు.